telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

సూపర్ ఓవర్ .. న్యూజిలాండ్‌ కు కొత్త కాదు..

newzeland faced 3 times super over in 7 months

న్యూజిలాండ్‌ గత ఏడు నెలల్లో మూడుసార్లు సూపర్‌ ఓవర్‌కు వెళ్లి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మూడింటిలోనూ ఆ జట్టు ఓటమిపాలవటం కొసమెరుపు. ఇంకా విచిత్రమేమంటే ఆ మూడు మ్యాచ్‌లకు వ్యాఖ్యాత కూడా ఒక్కరే. ఆయనే కివీస్‌ మాజీ వికెట్‌ కీపర్‌ ఇయాన్‌ స్మిత్‌. న్యూజిలాండ్‌ గతేడాది జులైలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో ఫైనల్లో తలపడింది. తొలుత ఇరు జట్లు 241 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టైగా మారింది. అనంతరం సూపర్‌లోనూ కివీస్‌, ఇంగ్లాండ్‌ చెరో 15 పరుగులు చేశాయి. అయితే, బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లీష్ జట్టును విజేతగా ప్రకటించారు. దీంతో కివీస్‌ తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలనుకున్న కల.. కలగానే మిగిలిపోయింది. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌ గడ్డపై జరిగిన ఐదు టీ20ల సిరీస్ చివరి మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్‌, కివీస్‌ జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తొలుత 146/5 స్కోర్‌ చేయగా ఛేదనలో ఇంగ్లాండ్‌ 146/7 పరుగులే చేసింది.

అనంతరం జరిగిన సూపర్‌ ఓవర్‌లో ఇంగ్లాండ్‌ 17 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు 8 పరుగులకే పరిమితమైంది. దీంతో విలియమ్సన్‌ జట్టు మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కోల్పోయింది. ఇక గురువారం జరిగిన మూడో టీ20లో భారత్‌ 179/5 పరుగులు చేయగా కివీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి అన్నే పరుగులు చేసింది. సూపర్‌ ఓవర్‌లో రోహిత్‌ చివరి రెండు బంతులకు సిక్సులు బాది జట్టును గెలిపించడంతో పాటు సిరీస్‌ను కైవసం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాక.. స్మిత్‌ కామెంట్రీ చేస్తూ ‘ఈ సూపర్‌ ఓవర్‌ కూడా సమమైతే, నేను రిటైరైపోతా. ఎన్నో ఏళ్ల నా జీవితాన్ని కోల్పోతా. ఈ ఆటను ఎంతో ఆస్వాదించా. చాలా చాలా ఆనందించా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సూపర్‌ ఓవర్లు తమకు కలిసిరావని చెప్పాడు. నిజం చెప్పాలంటే మ్యాచ్‌ ఫలితాన్ని ఇక్కడి వరకు తీసుకురాకుండా ముందే పూర్తి చేయాలని తెలిపాడు. ఆఖరి ఓవర్‌లోనే విజయాన్ని అందుకోకపోవడం సిగ్గుచేటుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Related posts