ఏపీలోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ దంపతులు నెల దాటిందో లేదో మృత్యు ఒడికి చేరుకున్నారు. వీరిద్దరు ఆత్మహత్య చేసుకోవడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది..
వివరాల్లోకి వెళ్తే..
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లకు చెందిన పొదిలి శ్రీమన్నారాయణ, రమణమ్మ దంపతుల కుమారుడు మహానంది(30). ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాయ్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా మహానంది విధులు నిర్వహిస్తున్నారు. ఇతనికి గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన ఒంగోలు మండలం ముక్తి నూతలపాడుకు చెందిన ప్రియాంక అనే 24 ఏళ్ల యువతితో పెళ్లి చేశారు.
సంక్రాంతి జరుపుకొని పండుగ తర్వాత భార్యను మెట్టింట్లోనే ఉంచి మహానంది ఛత్తీస్ గఢ్లో విధుల్లో చేరాడు. ఇటీవల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రకటన విడుదల అయింది. దీంతో పరీక్షలకు సిద్ధం కావాలని మహానంది భార్యను ప్రియాంకను కోరాడు. అయితే, ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదని ప్రియాంక చెప్పేసింది. ఇతను ఉద్యోగం చేయాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చినట్లుగా తల్లిదండ్రులు తెలిపారు.
ఇది భరించలేని ప్రియాంక ఈ నెల 4న పుట్టింట్లోని తన పడక గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా…భార్య మరణవార్త తెలిసి భర్త పొదిలి మహానంది.. గుండ్లకమ్మ ప్రాజెక్టు లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు..దీంతో ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణానికి వీరిద్దరు పాల్పడ్డట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.