పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ట్రాన్స్ ట్రాయ్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకుని, కొత్తగా మరోసారి టెండర్లను పిలవాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రధాన కాంట్రాక్టర్ తో కాంట్రాక్టు రద్దయితే, సబ్ కాంట్రాక్టులు కూడా రద్దయి పోతాయని, అందువల్ల అన్ని పనులకూ టెండర్లు పిలవాలని అధికారులు తమ నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం. చంద్రబాబు సర్కారు హయాంలో ప్రధాన ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అవినీతి, అంచనాల పెంపు, అవకతవకలపై విచారించి నివేదిక ఇవ్వాలంటూ విశ్రాంత ఇంజినీర్లతో కూడాన ఓ కమిటీని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. వీరు తొలుత పోలవరంపై అధ్యయనం చేసి, అన్ని రికార్డులనూ పరిశీలించారు. ఆపై ప్రాజెక్ట్ ఇంజినీరు ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీరు శ్రీధర్ తదితరులను ప్రశ్నించి, కొన్ని సిఫార్సులు చేస్తూ రిపోర్ట్ ను సిద్ధం చేసింది.
సీల్డ్ కవర్ లో ఈ రిపోర్టు నేడు జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందనుంది. వాస్తవానికి పోలవరం పనులను 2013లో ట్రాన్స్ ట్రాయ్ దక్కించుకుంది. అంచనా విలువపై 14 శాతం తక్కువ కోట్ చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎల్ అండ్ టీ, బావర్, త్రివేణి, కెల్లర్, బెకం తదితర సంస్థలు సబ్ కాంట్రాక్టర్లుగా చేరాయి. ఆపై ప్రాజెక్టు పనుల విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అంచనా వ్యయాలు పెరిగిపోయాయి. స్పిల్ వే, కాఫర్ డ్యాం తదితర పనులను ట్రాన్స్ ట్రాయ్ నుంచి తొలగించి నవయుగ సంస్థకు అప్పగించారు. ట్రాన్స్ ట్రాయ్ దివాలా తీసింది. దీంతో ప్రాజెక్టు పనులను పలు సంస్థలకు అప్పగించారు.