telugu navyamedia
ఆరోగ్యం సామాజిక

సెల్ఫీలతో కొత్త రోగం.. ఈ వ్యాధి సోకితే నరకమే!

మీకు సెల్ఫీలు ఎక్కువగా తీసుకునే అలవాటు ఉందా? నిత్యం ఫోన్‌తో ఉంటూ సెల్ఫీల ప్రపంచంలో విహరిస్తూ ఉంటారా? అయితే, జాగ్రత్త! మీకు తెలియకుండానే ఈ కొత్తరకం వ్యాధిబారిన పడొచ్చు. భరించలేని నొప్పితో ఆసుపత్రిపాలు కావచ్చు. వైద్యులు దీన్ని ‘సెల్ఫీ వ్రిస్ట్’ వ్యాధి అని పేర్కొంటున్నారు.

గత కొన్నాళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య క్రమేనా పెరుగుతోందని, ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయని ‘ఫాక్స్ న్యూస్’ సంస్థ పేర్కొంది. వైద్య పరిభాషలో దీన్ని ‘కార్పాల్ టన్నెల్ సిండ్రోమ్’ అంటారని తెలిపింది. చేతిని పదే పదే ఒకే స్థితిలో ఉంచినప్పుడు కార్పాల్ ఎముకల నుంచి వెళ్లే ప్రధాన నరాల వ్యవస్థ ఒత్తిడికి లోనవ్వుతుంది. ఫలితంగా మణికట్టు, చేతి వేళ్లు తీవ్రంగా నొప్పి పెడతాయి. దీనివల్ల జలదరింపు, తిమ్మిరిలు, నొప్పి వంటివి ఏర్పడతాయని వైద్యులు తెలిపారు.

సెల్ఫీ తీసుకున్నప్పుడు మొబైల్‌ లేదా సెల్ఫీ స్టిక్‌ను ఎక్కువ సేపు పట్టుకోవడం లేదా పదే పదే అటూ కదల్చడం వల్ల ఈ సమస్య ఏర్పడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. దీనివల్ల రోగులు మణికట్టు నొప్పితో బాధపడతారని, సెల్ఫీలతో ఎక్కువ సేపు గడిపేవారికి ఇది దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం కూడా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. సెల్ఫీల మోజులో కొంతమంది కాళ్లు, చేతులను పోగొట్టుకుంటున్నారని ఐరిష్‌కు చెందిన ఓ వైద్య పరిశోధనల పత్రిక వెల్లడించింది. రాళ్ల మీద నుంచి దూకడం లేదా సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో చేతులతో బలమైన వస్తువులను ఢీకొట్టడం వల్ల తీవ్రంగా గాయపడుతున్నారని తెలిపింది. ఈ ఏడాది నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. 2011 నుంచి 2017 నవంబరు వరకు 259 సెల్ఫీ మరణాలు సంభవించాయి. వీటిలో అత్యధిక మరణాలు ఇండియా, అమెరికా, రష్యా, పాకిస్తాన్‌లలో చోటుచేసుకున్నాయి. కాబట్టి, సెల్ఫీలు తీసుకునేప్పుడు జాగ్రత్త పాటించండి. ఈ విషయాన్ని మీ ఆప్తులతోనూ పంచుకోండి.

Related posts