ఇటీవల సంచలనంగా మారిన వ్యాపారి జయరాం హత్యకేసులో విచారణ జరుగుతున్న కొద్దీ కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు విషప్రయోగం జరిగిందనుకున్నారు. కానీ తాజా విచారణలో ఆయనను ఐదుగురు కలిసి హత్య చేసినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. పెనుగులాట, పిడిగుద్దుల వల్లే జయరాం మృతిచెందినట్టు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం ఈ హత్యలో ఐదుగురు పాల్గొన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఏపీలో ఉన్న నిందితుల్ని పీటీ వారెంట్పై తీసుకొచ్చి విచారించాలని జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయించారు. ఇందుకోసం నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ కూడా తీసుకున్నారు.
జయరాం భార్య పద్మశ్రీ పిటిషన్లో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తామని వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు పరిశీలించామని, శిఖా చౌదరిని కూడా విచారిస్తామని పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరూ తప్పించుకోలేరని డీసీపీ హెచ్చరించారు.