ఇప్పటివరకు అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలన్నిటిని ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే అవినీతి శాఖగా అపఖ్యాతిని మూటగట్టుకున్న రెవెన్యూను సంపూర్ణంగా సంస్కరించాల్సిన అవసరముందని గత అసెంబ్లీ సమావేశాల్లోనే కాకుండా.. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు కూడా కేసీయార్ పేర్కొన్నారు.. ఇదే కాకుండా ప్రస్తుతం వరకు మనుగడలో ఉన్న 124 చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు, కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడటం, గజిబిజిగా ఉన్న చట్టాలను సులభతరం చేస్తూ కొత్త చట్టానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో కేంద్రం నిర్దేశించిన టైటిల్ గ్యారంటీ చట్టం అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.
ఈ చట్టం అమలు అనుకున్నంత సులువు కాదని ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో జరిగిన రెవిన్యూ ఉద్యోగులపై దాడులకు ప్రధాన కారణం అవినీతి అనే విషయం అందరికి తెలిసిందే. కొందరు ఉద్యోగుల అవినీతిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వీఆర్వో, వీఆర్ఏల సేవలు చాలించుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త రెవెన్యూ చట్టం ఎవరి కొలువులకు ఎసరు తెస్తుందోననే ఆందోళన ఉద్యోగవర్గాల్లో కనిపిస్తోంది… ఏది ఏమైనా అవినీతి ప్రక్షాళన జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుంది. కాని అన్ని చోట్ల ఈ అవినీతి పాతుకుపోయి ఉంది. ఒక్క చోట ఈ రోగాన్ని నయం చేస్తే ఉపయోగం ఏముండదన్న వాదన కూడా వినిపిస్తుంది.