సోమవారం అర్ధరాత్రి మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ రింగు రోడ్డు రహదారి మలుపు వద్ద ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నార్సింగ్ పోలీస్స్టేషన్ పరిధిలోని అల్కాపురి కాలనీలో జరిగిన ఈ ప్రమాదంలో వేగంగా దూసుకొచ్చిన ఓ వోల్వో కారు డివైడర్ను, పక్కనే ఉన్న పిట్టగోడను ఢీకొట్టింది. ఘటన జరిగిన సమయంలో కారులో ప్రముఖ సినీ నటుడు రాజ్తరుణ్ ఉన్నట్టు సీసీ ఫుటేజీలో వెల్లడైంది. తాజాగా ఈ ఘటన గురించి ట్విటర్ ద్వారా రాజ్ తరుణ్ స్పందించాడు. కారులో ఉన్నది తానేనని వెల్లడించాడు. “నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. నేను క్షేమంగా ఉన్నానా? లేదా? అని తెలుసుకునేందుకు చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. నేను ఇంటి నుంచి నార్సింగ్ సర్కిల్ గుండా ప్రయాణిస్తున్నాను. ప్రమాదకర ప్రాంతంగా మారిన ఆ ప్రాంతంలో ఒక చోట హఠాత్తుగా కుడివైపునకు తిరగాల్సి వచ్చింది. దాంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీకొంది. ఆ శబ్దానికి నా చెవులు బ్లాక్ అయిపోయాయి. దృష్టి కూడా చెదిరిపోయింది. హఠాత్తుగా గుండె వేగం కూడా పెరిగిపోవడంతో ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో నేను క్షేమంగానే బయటపడ్డాను. ఎవరి సహాయమైనా తీసుకుందామని వెంటనే ఇంటికి వెళ్లాను. ఆరోజు ఇదే జరిగింది. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలో మళ్లీ షూటింగ్కు హాజరవుతాను. ధన్యవాదాలు” అని రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు. దీంతో ఒక నెటిజన్ “తాగి కారు నడపడం వల్లే యాక్సిడెంట్ అయిందా?” అని ప్రశ్నించారు. దానికి స్పందించిన రాజ్ తరుణ్ “అదేం ప్రశ్న భయ్యా… నేను తాగలేదు” అని తెలిపాడు.
previous post
మనం పీకేదేమీ లేదక్కడ… హౌస్లో నేను ప్రత్యక్షంగా చూశాను : బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్చన