ఇండియాతో యుద్ధం అవసరమైతే తమ సైన్యం సిద్ధంగా ఉందని నేపాల్ మంత్రి ఈశ్వర్ పోఖ్రేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర తదితర ప్రాంతాలు తమవేనని నేపాల్ వాదిస్తున్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే ఇటీవల మాట్లాడుతూ, మరో దేశం తరఫున నేపాల్ వకాల్తా పుచ్చుకుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇండియాతో చైనా చేస్తున్న ప్రచ్ఛన్న యుద్ధంలో నేపాల్ చైనాకు అనుకూలంగా మారిపోయిందని కూడా అన్నారు. తమ దేశానికి అత్యవసరమైతే నేపాల్ సైన్యం స్వయంగా రంగంలోకి దిగాలే తప్ప, మరొకరిపై ఆధారపడరాదని అన్నారు. నరవాణే వ్యాఖ్యలను ప్రస్తావించిన ఈశ్వర్ పోఖ్రేల్, రాజకీయ ఉద్దేశాలతో తమ సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు.
ఇండియాను రక్షించేందుకు నేపాలీ గూర్ఖా సైన్యం తమ ప్రాణాలను అర్పించిన సంగతిని ఆయన మరిచారని అన్నారు. వారి మనోభావాలను నరవాణే కించ పరిచారని, గూర్ఖా బలగాలకు ఎదురుగా నిలవడం ఇండియాకు కష్టంగా మారినట్టుందని అన్నారు. సమయం వచ్చి, యుద్ధమే అవసరమైతే తమ సైన్యం సిద్ధంగా ఉందని అన్నారు.