కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా అనేక ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. విద్యార్థుల వార్షిక పరీక్షలు సైతం నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వివిధ పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించింది. జులై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ జులై 26న ఉంటుందని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.
ఇక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఆగస్టులో జరగొచ్చని అన్నారు. పరీక్ష తేదీలు ఇంకా నిర్ణయించలేదు. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల కొత్త తేదీలు ఈ వారంలో ప్రకటిస్తారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. నీట్ కోసం దేశవ్యాప్తంగా 15.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.