లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పలు సర్వే సంస్థలు ఓటర్ల అభిప్రాయం తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ, తొలి దశ ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను ప్రకటించింది.
17 లోక్ సభ సీట్లున్న తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 15 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఇతరులు 2 చోట్ల గెలుస్తారని పేర్కొంది. 25 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 సీట్లలో గెలుస్తుందని పేర్కొంది.
అదేవిధంగా 39 సీట్లున్న తమిళనాడులో డీఎంకే 25 చోట్ల విజయం సాధిస్తుందని, 21 సీట్లున్న ఒడిశాలో బిజూ జనతాదళ్ 16 చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయని అంచనా వేసింది. 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు 30 సీట్ల వరకు వచ్చే అవకాశముందని వెల్లడించింది.