ఎన్కౌంటర్ లో హతమైన గ్యాంగ్స్టర్ నయీమ్ ముఠా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. నయీమ్ అనుచరుల భూకబ్జా వ్యవహారంలో ఐదుగురు సభ్యుల ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ డ్యాక్యుమెంట్లతో నయీం బినామీ ఆస్తులను విక్రయించేందుకు ఈ గ్యాంగ్ యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. భార్య హసీనా బేగం, పాశం శ్రీను, ఫంహీ, నజీర్, తుమ్మ శ్రీనివాస్ని అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి రూ.88.37లక్షలు, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
భువనగిరి సమీపంలోని నయీమ్ కు చెందిన భూమి తుమ్మ శ్రీనివాస్ పేరున రిజిస్ట్రేషన్ అయింది. ఈ భూమిని విక్రయించాలని ఈ ముఠా ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. రూ.89 లక్షలకు ఐదు ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 8వ తేదీన భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో నయీమ్ అనుచరులపై ఆరా తీశారు.