ఒక కొబ్బరికాయ మహా అయితే 30 రూపాయలు ఉంటుంది. అది ఒక్కటి తెచ్చుకుంటే, రెండు చిప్పలు వస్తాయి. అలాంటిది మరి ఏకంగా ఒక్క చిప్ప ఖరీదు 1400 ఎందుకు, అదికూడా అమెజాన్ లాంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో దీనిని అంత ఖరీదు కు ఎందుకు అమ్ముతున్నారు… ఈ ప్రశ్నకు సమాధానం మనకే కాదు, ఒక ఐపీఎస్ కి వచ్చింది.. దానికి ఇంకా సమాధానమే తెలియలేదు. మీరు ప్రయత్నించండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి… ఈ సహజ కొబ్బరి చిప్పను ఆన్లైన్లో చూసిన ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి ఆశ్చర్యపోయి దాన్ని ట్విటర్లో పంచుకున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ను పోస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ చిప్ప అసలు ఖరీదు రూ.3 వేలట. 55 శాతం ఆఫర్లో భాగంగా రూ.1,365కి లభిస్తోంది. పైగా దీని సైజు కూడా ఒకటిన్నర అంగుళాల ఎత్తు, నాలుగున్నర అంగుళాల వెడల్పు మాత్రమే. ఓ వంద మిల్లీ లీటర్ల నీళ్లు పట్టేంత ఖాళీ మాత్రమే ఉంటుంది.
ఇటీవలి కాలంలో కొబ్బరి చిప్పలతో చేసిన బౌల్స్ వాడడం ట్రెండ్గా మారింది. కొబ్బరి చిప్పలను పాలిష్ చేసి, అందమైన రంగులోకి మలుస్తున్న చిప్పలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. కానీ ఇవి ఒక్కొక్కటీ రూ.100లోపే ఉంటున్నాయి. మరి సాధారణ కొబ్బరి చిప్పను ఏకంగా రూ.1,365కు అమ్మడం మాత్రం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి ట్వీట్పైనా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.