నాసా(నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)ను తెగ పొగిడేస్తుంది. మాకు స్ఫూర్తిగా నిలిచారంటూ కొనియాడింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీదుగా చంద్రయాన్ 2లో అంతర్భాగమైన విక్రమ్ను పంపేందుకు ప్రయత్నించారు. ఇది తమకెంతో ఇన్స్పిరేషన్గా నిలిచిందని తెలిపారు. ఇస్రోతో కలిసి తాము పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ ఉద్దేశాన్ని బయటపెట్టారు. శనివారం చంద్రుడి తలంపై అడుగుపెట్టాల్సిన చంద్రయాన్-2 సిగ్నల్ కోల్పోయింది. ఈ ఘటన కాస్త నిరాశపరిచినా ఇస్రో చేసిన ప్రయోగం భారత సత్తాను దశదిశలా తెలిసేలా చేసింది. ఈ సందర్భంగా నాసా ట్విట్టర్లో ఓ పోస్టు చేసింది.
అంతరిక్షాన్ని చేధించడం అంత సులువు కాదు. ఇస్రో చేసిన ప్రయోగానికి మేము అభినందిస్తున్నాం. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయ్యేలా చేసిన ప్రయోగం అద్భుతంగా అనిపించింది. ఈ ప్రయాణం మాకు స్ఫూర్తి కలిగేలా చేసింది. సోలార్ సిస్టమ్పై చేసే ప్రయోగంలో మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం.. అని ట్వీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్తో కమ్యూనికేషన్ కోల్పోయామని ఇస్రో ఛైర్మన్ కే శివన్ ప్రకటించారు. చంద్రుడికి 2.1కి.మీ దూరంలో ల్యూనార్ తలంలోనే ల్యాండర్ ఆగిపోయిందని సమాచారం. సెప్టెంబర్ 2న చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. ఆఖరుగా విజయవంతంగా పూర్తి అయింది ఇదే. జులై 22న ఈ ప్రయోగం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జరిగింది.