నిత్యం ప్రాణాయామం చేయడం ద్వారా శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి యోగాసనాలు వేయాలని పిలుపునిచ్చారు.
శ్వాసను అదుపులో ఉంచుకోవడం, అనులోమ, విలోమ ప్రక్రియల ద్వారా ఎంతో మేలు కలుగుతుంది. రోజువారీ దినచర్యలో ఈ యోగాసనాన్ని భాగం చేసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి బారినపడిన ఎంతో మంది యోగాసనాల ద్వారా లబ్దిని పొందుతున్నారన్నారు. ఆసనాలు వేస్తుంటే, వారిలో వైరస్ ను జయించగలమన్న నమ్మకం పెరుగుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, కరోనాపై పోరాటానికి అవసరమైన భౌతిక శక్తిని పొందాలంటే యోగా ఓ మార్గం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సంవత్సరం యోగా దినోత్సవం డిజిటల్ రూపంలోకి మారిపోయిందని, కుటుంబంతో కలిసి యోగా డే జరుపుకునే అవకాశాన్ని దగ్గర చేసిందని మోదీ వ్యాఖ్యానించారు. భూమిని మరింత ఆరోగ్యవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ యోగాను అలవరచుకోవాలని చెప్పారు. తద్వారా మనుషుల్లో మానవత్వం పెరుగుతుందని, ప్రజలను ఏకం చేస్తుందని ఆయన అన్నారు.