ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి 71వ జన్మదినోత్సవం.ఈ సందర్భంగా మోడీ వ్యక్తిత్వం తెలిపే ఓ ఆసక్తికమైన ఘటన .1990 సంవత్సరం. నిజాలు ఒక్కోసారి నిజమేనని నమ్మలేనంత విడ్డూరంగా వుంటాయి.
అంటే సుమారు కొంచెం అటూ ఇటుగా ముప్పయ్యేళ్ల పై చిలుకు ముచ్చట. ఇద్డరు యువతులు ఢిల్లీ వెళ్ళడానికి లక్నోలో రైలెక్కారు. ఆ మరునాడే మళ్ళీ వాళ్ళు అహ్మదాబాద్ వెళ్ళాలి. రైలు కదిలేముందు ఇద్దరు బడా నేతలు అదే బోగీలోకి ఎక్కారు. వారితో పాటే బిలబిలమంటూ మరో డజను మంది వారి అనుచరులు కూడా లోపలకు జొరబడ్డారు. ఆ యువతుల్ని సామాన్లమీద కూర్చోమని హుకుం జారీ చేసి వాళ్ళు బెర్తుల్ని దర్జాగా ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగారా లేదు, పక్కన ఆడవాళ్ళు వున్నారు అనే సోయి కూడా లేకుండా పెద్ద గొంతుతో అసభ్య పదజాలంతో సంభాషణ సాగించారు. వారి ధోరణితో ఆ యువతులు బిక్కచచ్చిపోయారు. ఢిల్లీ చేరేంతవరకు ప్రాణాలు అరచేతపెట్టుకుని ప్రయాణం చేశారు.
మరునాడు రాత్రి ఢిల్లీ నుంచి అహమ్మదాబాదు వెళ్లేందుకు ఆ యువతులు రైలెక్కారు. మళ్ళీ ‘మరో’ ఇద్దరు నేతలు అదే బోగీలో కనబడ్డారు. రాత్రి అనుభవం ఇంకా వారి మనసులో పచ్చిగా వుండిపోవడంతో యువతుల్లో భయం రెట్టింపు అయింది. అయితే చిత్రం. ఆ కొత్త వారిద్దరూ ఆడవాళ్లని చూడగానే వారు జరిగి సర్దుకు కూర్చొని ఆడవాళ్ళకు చోటిచ్చారు. వారితోపాటు అనుచరగణం కూడా లేకపోవడంతో తరువాత ఆ ఇద్దరి ఆడవాళ్లకు ప్రయాణం సాఫీగా సాగిపోయింది. మరునాడు ఉదయం రైలుదిగి ఎవరిదోవనవాళ్లు వెళ్ళబోయేముందు ఒక యువతి డైరీ తెరచి పట్టుకుని ‘”నేనూ నా స్నేహితురాలు ఇద్దరం రైల్వేలో ప్రొబేషనరీ అధికారులుగా పనిచేస్తున్నాము. నా పేరు లీనా శర్మ. మేము శిక్షణకోసం ఈ ప్రయాణం పెట్టుకున్నాము.
మీవంటి వారు తోడుగా వుండడం వల్ల రాత్రి మా ప్రయాణం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోయింది. ధన్యవాదాలు” చెప్పి వారి పేర్లు ఆ ఇద్దరిలో ఒకతను జవాబు చెప్పాడు.”నా పేరు శంకర్ సింగ్ వాఘేలా, ఇతడు నా రాజకీయ సహచరుడు నరేంద్ర మోడీ ఈ కథనం హిందూ దిన పత్రికలో 01-06-2014 తేదీన ప్రచురితమైంది .
– భండారు శ్రీనివాసరావు