కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి సినీ తారలు నడుం బిగించారు. ప్రజలకు పాటల రూపంలో సందేశాన్ని చేరవేస్తున్నారు. కోటి సంగీత సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సంయుక్తంగా చేసిన పాట బాగా పాపులర్ అయ్యింది. ఈ పాట వీడియోను డీడీ న్యూస్ ఏప్రిల్ 2న ట్వీట్ చేసింది. తెలుగు నటులు చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కలిసి కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తూ చేసిన మ్యూజిక్ వీడియో ఇది. ఎవరి ఇళ్లలో వారు ఉంటూ రికార్డ్ చేశారు. ఎవరి ఇళ్లలో వారు ఉంటూ వైరస్పై పోరాడాలని ఈ నటులు అందరినీ కోరుతున్నారు. వ్యక్తిగత దూరం, పరిశుభ్రతను పాటించడం అవసరమని చెబుతున్నారు, అని తన ట్వీట్లో డీడీ న్యూస్ పేర్కొంది. అయితే, ఈ ట్వీట్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చూశారు. వెంటనే స్పందించారు. తెలుగు భాషలో ట్వీట్ చేశారు. చిరంజీవిగారికి, నాగార్జునగారికి, వరుణ్ తేజ్కి, సాయి ధరమ్ తేజ్కి మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్పై విజయం సాధిద్దాం అని తన ట్వీట్లో మోదీ పేర్కొన్నారు. తమ హీరోల వీడియోను ప్రధాన మంత్రి మెచ్చుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం. #IndiaFightsCorona https://t.co/01dO5asinD
— Narendra Modi (@narendramodi) April 3, 2020