బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. మరోవైపు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తికి డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని తెలియడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఈ రోజు (శుక్రవారం) ఉదయం రియా ఇంట్లో సోదాలు నిర్వహించింది ఎన్సీబీ. మెరుపు దాడులు చేసి ఆమె సోదరుడు షోవిక్ ని అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా సాగుతున్న దర్యాప్తులో భాగంగా నేటి ఉదయం రియా చక్రవర్తి సహా ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండా ఇళ్లపై ఆకస్మిక దాడులు చేశారు. సుమారు నాలుగైదు గంటలు సోదాలు చేసి ఆ తర్వాత రియా సోదరుడు షోవిక్ని, శామ్యూల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ ఇష్యూపై వీరిద్దరూ పొంతనలేని సమాధానాలు ఇస్తుండటంతో అనుమానం వచ్చిన అధికారులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మరోవైపు ఇప్పటికే డ్రగ్ డీలర్ జైద్ విలాత్రా, బాసిత్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఎన్సీబీ అధికారులు. కాగా ఈ దాడుల అనంతరం నార్కోటిక్స్ బ్యూరో జోనల్ డిప్యూటీ డైరెక్టర్ ఎంకే జైన్ మీడియాకు కొన్ని విషయాలు చెప్పారు. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ సూచనల మేరకు సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండా డ్రగ్స్ సేకరించినట్టు తమకు తెలిసిందని అన్నారు. ఈ మేరకు రియాను, ఆమె సోదరుడు షోవిక్కి, శామ్యూల్ మిరాండాకు సమన్లు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. గతేడాది మే నెలలో మిరాండాను సుశాంత్ ఇంట్లో మేనేజర్గా రియా నియమించింది. ఆమె కారణంగానే సుశాంత్ డ్రగ్స్కి అలవాటు పడ్డాడని తెలుస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.