ఏపీ సీఎం జగన్పై నారా లోకేశ్ మరోసారి నిప్పులు చెరిగారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసిందని..గెలుపు కోసం సీఎం జగన్ ఎన్నో అడ్డదారులు తొక్కారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ చేయని దౌర్జన్యాలు లేవని లోకేశ్ ధ్వజమెత్తారు. “పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్ తొక్కని అడ్డదారులు లేవు. అధికార మదంతో అరాచకాలు సృష్టించారు. అర్ధరాత్రి అధికారులను ప్రలోభాలకు గురిచేసి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. విజయనగరం జిల్లా, కొత్తవలస గ్రామ పంచాయతీలో టిడిపి బలపర్చిన అభ్యర్థి 260 ఓట్ల గెలిచినా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడితో వైకాపా గెలిచినట్టు ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు కొంతమంది అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం. చీకటి మాటున గెలిచాం అని ప్రకటించుకున్నా పగలు ధైర్యంగా జనాల్లో తిరగలేని పరిస్థితి వైకాపా నాయకులది. తప్పుడు పనులు చేసి అధికార పార్టీకి తొత్తులుగా మారిన కొంతమంది అధికారులపై ఎస్ఈసి చర్యలు తీసుకోవాలి. ఆధారాలు పరిశీలించి రీ-కౌంటింగ్ కి ఆదేశించాలి.” అంటూ నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
previous post
next post