*చంద్రబాబు హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు..
*విద్యుత్ ఛార్జీలు పెంపుపై టీడీపీ ఉద్యమం..
*ఛార్జీలు పెంపుతో పేద , మధ్యతరగతి ప్రజలుపై భారం..
*జగన్ పాలనలో ప్రజలు అనేక బాధలు పడుతున్నారు..
*నిరసనలు, ర్యాలీలతో ఏపీ అట్టడగుతుంది..
విద్యుత్ ఛార్జీల పెంపుతో ఏపీ రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. వరుస నిరసనలు, ర్యాలీలతో జగన్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష టిడిపి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బడ్జెట్ సమావేశాల సమయంలో కల్తీ మద్యంపై ఆందోళనలు చేపట్టిన టిడిపి తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన బాట పట్టింది.
ఈ క్రమంలో సామాన్య ప్రజలపై విద్యుత్ చార్జీల బారం మోపడాన్ని నిరసిస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినూత్న నిరసన చేపట్టారు. లాంతర్లను పట్టుకుని మంగళగిరిలోని టిడిపి కార్యాలయానికి చేరకున్నారు. అంధకార ప్రదేశ్, బాదుడే… బాదుడు అని రాసిన స్టిక్కర్లతో లోకేష్ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..సీఎం జగన్ ఏపీలో కొత్త పథకం తెచ్చారని.., ఉగాది నుంచి పేదలపై ఛార్జీలతో బాదేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. ఛార్జీలు తగ్గిస్తానని ప్రమాణస్వీకారం నాడు రెండు చేతులూ ఊపుతూ జగన్ ఆవేశంగా చెప్పారని.., అధికారంలోకి వచ్చాక ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ. 12 వేల కోట్లు లాగేశారని విమర్శించారు,
ఇక చెత్త పన్ను వేస్తున్నారని.., ఇంటి పన్ను కూడా పెంచారని మండిపడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడేలా విద్యుత్ ఛార్జీలు పెంచారన్న ఆయన.., ధనవంతులకు మాత్రం తక్కువ భారం పడేలా ఛార్జీలు ఉన్నాయన్నారు. పేదలు బాధపడాలి.. మధ్య తరగతి వారు ఇబ్బంది పడాలి.. ఇదేనా జగన్ విధానమని ప్రశ్నించారు
జగన్ తప్పుడు నిర్ణయాల వల్లే ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడుతోందని తప్పుబట్టారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. జగన్ రకరకాల పన్నులు వేస్తూ ప్రజలపై భారం మోపారని దుయ్యబట్టారు. ఎన్నికల హామీలను జగన్ తుంగలో తొక్కారని లోకేష్ విమర్శించారు.