ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విటర్ లో మండిపడ్డారు. జగన్ గారి ఉన్మాదం పతాకస్థాయికి చేరిందని ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు చెప్పండని పేర్కొన్నారు. ఒంటరి మహిళలని కూడా చూడకుండా వైసీపీ రౌడీలు దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లా తిమ్మారెడ్డిపాలెంలో ఆదిలక్ష్మమ్మ అనే మహిళ ఇంటి ముందు అడ్డుగా గోడ కట్టారని, ఈ గోడ చూస్తే జగన్ గారికి మహిళల పట్ల ఎలాంటి గౌరవం ఉందో అర్థమవుతుందని విమర్శించారు.
వైసీపీ కడుతున్న గోడలతో ప్రజలను ఇళ్ల నుంచి బయటికి రానివ్వకుండా ఆపగలరేమో కానీ, ప్రజల్లో ఈ చెత్త ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను మాత్రం ఆపలేరన్నారు. ఇన్నాళ్లు టీడీపీ కార్యకర్తల ఇళ్లకు అడ్డంగా గోడలు కట్టారు. ఇప్పుడు ఒంటరి మహిళలను కూడా వదలడంలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.