పేదవాడి ఆకలి తీర్చేందుకు గత టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం బుధవారం రాత్రి నుంచి అన్న క్యాంటీలను మూసివేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఆకలికి రాజకీయం తెలియదు ముఖ్యమంత్రి గారూ, అయినా మా మీద కోపంతో పేదవాళ్ల కడుపుమీద కొట్టడం భావ్యం కాదు” అంటూ హితవు పలికారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు.
అంతేకాదు, మూతపడిన ఓ అన్న క్యాంటీన్ ఫొటోను కూడా ట్విట్టర్ లో పోస్టు చేశారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో అన్న క్యాంటీన్లకు తెలుపు రంగు వేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అన్న క్యాంటీన్లకు బడుగు, బలహీన వర్గాల నుంచి విశేష ఆదరణ లభించింది. కేవలం అయిదు రూపాయలకే భోజనం లభిస్తుండడంతో వీటిలో ఎప్పుడూ విపరీతమైన రద్దీ కనిపించేది.