ఏపీ, హిందూపూరం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకం ఫోర్జరీ చేసిన బ్యాంకు ఉద్యోగిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వసుంధరకు హెచ్డీఎ్ఫసీ బ్యాంకు బంజారాహిల్స్ బ్రాంచిలో ఖాతా ఉంది. ఆమె ఇటీవల మొబైల్ యాప్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు బ్యాంకు అధికారులకు సమాచారం అందింది. దీన్ని ధ్రువీకరించుకునేందుకు బ్యాంకు రిలేషన్షిప్ మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్ శనివారం ఆమెకు ఫోన్ చేశారు. తాను యాప్ కోసం ఎలాంటి దరఖాస్తు చేయలేదని ఆమె సమాధానం ఇవ్వడంతో.. దరఖాస్తు ఫారాలపై సంతకం చేసిందెవరనే కోణంలో వారు విచారణ జరిపారు. బ్యాంకులో కొత్తగా చేరిన అకౌంటెంట్ కొర్రి శివ ఈ పని చేసినట్టు నిర్ధారించారు. అతడే వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. విషయాన్ని ఆమెకు చెప్పడంతో.. వసుంధర తరఫున ఆర్థిక లావాదేవీలు చూసే వెలగల సుబ్బారావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
previous post