సినీ హీరో, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని సందర్శించారు. ‘అఖండ’ చిత్రం భారీ విజయం సాధించడంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విజయోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. తాజాగా ఆయన ‘అఖండ’ టీంతో కలిసి తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని దర్శించారు.
హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు చేరుకున్న బాలయ్యను ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. అఖండ దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి బాలకృష్ణ శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సర్వాంగ సుందరంగా నిర్మితమవుతున్న ఆలయ పరిసరాలను బాలయ్య పరిశీలించారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో, దృఢ సంకల్పంతో భారత దేశంలోనే అందరూ స్వామివారిని దర్శించుకునేలా యాదాద్రిని రూపుదిద్దారని కొనియాడారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతమైన దేవాలయం యాదాద్రి ..ఆలయ నిర్మాణంలో పనిచేసిన ప్రతీ ఒక్క కార్మికునికి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా, కొత్త వైరస్ మహమ్మారుల నుంచి ప్రజలను కాపాడాలని లక్ష్మీనరసింహ స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. అఖండ సినిమా సక్సెస్ లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రలను దర్శించుకున్నామని బాలయ్య తెలిపారు.