telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య బంగారం అంటున్న అభిమానులు… క్యాన్సర్ తో బాధపడుతున్న బాలికకు సాయం…

Balakrishna

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ కుటుంబానికి చేసిన సహాయం గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. ‘బంగారం మా బాలయ్య’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య వైరల్‌గా మారారు. అసలేం జరిగిందంటే… అనంతపురం నగరంలోని సోమనాథనగర్‌లో నివాసముంటున్న వెంకట్రాముడు, అరుణ దంపతుల కుమార్తె స్వప్న బోన్ క్యానర్స్‌తో బాధపడుతోంది. వెంకట్రాముడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో కుమార్తెకు మెరుగైన చికిత్స అందించలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియక, కుమార్తెను ఆ పరిస్థితిలో చూడలేక ఈ దంపతులు కుమిలిపోతున్నారు. అయితే స్వప్న ధీనగాథపై ఈనాడు దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. దీంతో ఈ విషయాన్ని కొంత మంది అధికారులు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే బాలయ్య.. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గౌస్‌మొయిద్దీన్, ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామిలను స్వప్న ఇంటికి పంపారు. బాలికతో, ఆమె తల్లి అరుణతో బాలకృష్ణ స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. వాళ్లకు ధైర్యం చెప్పారు. స్వప్నకు బసవతారకం హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరి రావాలని, ఆపరేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేయిస్తానని గౌస్‌మొయిద్దీన్‌కు ఫోన్‌లో బాలయ్య సూచించారు. బాలయ్య మాత్రమే కాకుండా అనంతపురం జిల్లాలోని దాతలు కూడా స్పందించారు. కొంత మంది స్వప్న వద్దకు నేరుగా వచ్చి విరాళాలు అందజేయగా.. మరికొందరు ఆపరేషన్‌కు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దాతలు ఇచ్చిన మొత్తం రూ.3 లక్షల వరకు ఉంది. ఈ విషయాలు ఎలా ఉన్నా.. క్యానర్స్‌తో బాధపడుతోన్న స్వప్న గురించి తెలిసిన వెంటనే స్పందించడమే కాకుండా ఆపరేషన్‌కు కూడా ఏర్పాట్లు చేస్తోన్న బాలయ్య బాబును చూసి అభిమానులు పొంగిపోతున్నారు.

Related posts