ప్రతి పాత్రను తన వసం చేసుకున్న మహానటుడు, తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని తన నినాదంగా మార్చుకున్న మహానేత, తన పాలనతో పేదవాళ్ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు. తెలుగువారి ఆరాధ్యదైవం… విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.
ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య నివాళులర్పించారు. బాలకృష్ణతో పాటు రామకృష్ణ, సుహాసిని తదితరులు ఎన్టీఆర్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. విప్లవాత్మక పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు. అలాగే ఎన్టీఆర్ నటించిన సినిమాలు కూడా చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు లాక్ డౌన్ కారణంగా తెలుగుదేశం అభిమానులు నిరాడంబరంగా జరుపుకొంటున్నారు.