telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్త : బాలకృష్ణ

Balakrishna

కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసలుకోవాలని శ్రీ నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ పిలుపునిచ్చారు. ఈ పోరులో ప్రభుత్వాలు భాధ్యతగా పని చేయాలని అదే సమయంలో ప్రజలు కూడా అంతే భాద్యతాయుతంగా ఉండి తమను తాము పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు. వాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే వాక్సిన్ రావాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఇప్పటికే ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారని ఈ ప్లాస్మా వలన చాలా మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నారని వివరించారు. అలానే కరోనా పట్ల భయం వదలి కరోనాను జయించాలని విజ్ఞప్తి చేశారు.

నేటి ఉదయం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ కు మహేశ్వర మెడికల్ కాలేజి మరియు హాస్పిటల్, సంగారెడ్డి వారు కోవిడ్ రక్షణ కవచాలైన PPE కిట్స్ మరియు N95 మాస్క్ లు అందజేశారు. వీటిని హాస్పిటల్ తరపున శ్రీ బాలకృష్ణ స్వయంగా శ్రీ TGS మహేష్, ఛైర్మన్, మహేశ్వర మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్, సంగారెడ్డి చేతుల మీదుగా స్వీకరించారు. మొత్తం 1000 PPE కిట్లు, 1000 N95 మాస్క్ లను ఈ సందర్భంగా మహేశ్వర మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ వారు BIACH&RI కు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ శ్రీ మహేష్ గారు కోవిడ్ మహమ్మారి తో పోరాటంలో చేస్తున్న సహాయం ఎంతో మేలు కలిగిస్తోందని ప్రశంసించారు. మెడికల్ కాలేజీ గా వైద్య చికిత్సకే పరిమితం కాకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మహేష్ గారు తన వంతు పాత్ర పోషిస్తున్నారని శ్రీ బాలకృష్ణ అన్నారు. ముఖ్యంగా కోవిడ్ కారణంగా క్యాన్సర్ చికిత్స నిలిపివేయలేమని ఈ విషయంలో BIACH&RI వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొన్నామని చికిత్స కు వచ్చే ప్రతి వ్యక్తిని ముందుగా స్క్రీన్ చేస్తున్నామని ఒక వేళ ఎవరిపైనన్నా సందేహం వస్తే వారిని పరీక్షా కేంద్రానికి పంపిస్తున్నామని చెప్పారు. ఇపుడు మహేశ్వర మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ వారు చేస్తున్న ఈ సహాయం క్యాన్సర్ హాస్పిటల్ వారు కోవిడ్ పై చేస్తున్న పోరాటానికి ఎంతో సహాయకారిగా నిలుస్తుందన్నారు.

కార్యక్రమ అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ షూటింగ్ లకు ప్రభుత్వ అనుమతి ఇపుడే వచ్చిందని, త్వరలోనే దీనిపై పరిశ్రమ పెద్దలందరూ కూచుని చర్చించుకొని నిర్ణయం తీసుకొంటామని శ్రీ బాలకృష్ణ అన్నారు. షూటింగ్ లు అంటే చాలా మంది ఉంటారని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో శ్రీ నందమూరి బాలకృష్ణ తో పాటూ డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; శ్రీ TGS మహేష్, ఛైర్మన్, మహేశ్వరి మెడికల్ కాలేజి మరియు హాస్పిటల్, సంగారెడ్డి; డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; శ్రీ జి రవికుమార్, COO, BIACH&RI; డా. కల్పనా రఘునాథ్, అసోసియేట్ డైరెక్టర్, మెడికల్, BIACH&RI; డా. సవిత, డిప్యూటీ డైరెక్టర్, మహేశ్వరి మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్, సంగారెడ్డి; డా. దేవరాయ ఛౌదరి, ప్రొఫెసర్, మహేశ్వరి మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్, సంగారెడ్డి లతో పాటూ ఇరు సంస్థలకు చెందిన పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts