హాలీవుడ్లో మీ టూ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో తను శ్రీ దత్తా బాలీవుడ్ లో పెద్ద బాంబే పేల్చింది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నానా పటేకర్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, 2008లో `హార్న్ ఓకే ప్లీజ్` సినిమా సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఒక్కసారిగా పనిచేసే ప్రదేశాల్లోని మహిళల భద్రతపై దేశం యావత్తు పెద్ద చర్చే జరిగింది. అక్కడ నుండి మీటూ ఉద్యమం దక్షిణాది సినీ పరిశ్రమకు కూడా వచ్చింది. ఇలా పెద్ద ఎత్తున ఇండియాలో కూడా మీ టూ ఉద్యమం మొదలైంది.
అయితే తనుశ్రీ తనపై చేసిన వ్యాఖ్యలను నానా పటేకర్ ఖండించారు. ఇక నానా పటేకర్, తనుశ్రీదత్తా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు. వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. మీటూ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలకు అనుకూలంగా ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. దీంతో పోలీసులు తను శ్రీదత్తా పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తుందంటూ అప్పట్లో ఆరోపణలు కూడా చేశారు. దీనిపై తనుశ్రీ పెద్ద ఎత్తున పోలీసులపై విరుచుకుపడింది. మొత్తానికి పోలీసులకు సరైన ఆధారాలు దొరకనందున ఈ కేసులో విచారణను క్లోజ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తాము కోర్టుకు వెళతామని తనుశ్రీ దత్తా లాయర్ అన్నారు.