దివంగత భారత ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసు దోషి నళిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గత 29 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి నళిని శ్రీహరన్ వేలూరు మహిళా జైలులో గత రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె లాయర్ పుహలెంది తెలిపారు. గమనించిన జైలు అధికారులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. బెయిలు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నళిని ఇటీవల పెరోల్పై కుమార్తె హరిత వివాహం కోసం ఆరు నెలలపాటు బయటకు వచ్చారు. పెరోల్ ముగిసిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లారు.
తోటి ఖైదీ, నళికి మధ్య జైలులో గొడవ జరిగిందని, దీంతో ఆ మహిళ విషయాన్ని జైలర్ దృష్టికి తీసుకెళ్లిందని పుహలెంది తెలిపారు. ఆ వెంటనే నళిని ఆత్మహత్యకు యత్నించినట్టు పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ నళిని ఇలా ప్రవర్తించలేదని అన్నారు. ఇందుకు గల అసలు కారణాలు తెలుసుకుంటామని తెలిపారు. విషయం తెలిసిన నళిని భర్త తనను పిలిచి ఆమెను పుళల్ జైలుకు తరలించేలా చూడాలని కోరారని తెలిపింది. ఈ విషయమై కోర్టును ఆశ్రయిస్తామని పుహలెంది వివరించారు.