*యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది రోహిత్
*మాట్లాడాలని యువతిని పిలిచి కత్తితో దాడి..
*డిగ్రీ సెకండియర్ చదువుతున్న రోహిత్
*సర్ప్రైజ్ అంటూ కత్తితో దాడి
*యువతిపై 8 చోట్ల గాయాలు..
*పోలీసుల అదుపులో నిందితుడు రోహిత్
నల్లగొండ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు పట్టపగలే ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీటీఎస్ ఫారెస్ట్ పార్కులో మంగళవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
రోహిత్ (21) అనే యువకుడు నల్గొండలోని ఎన్జీ కాలేజీలో బీబీఏ సెకండియర్ చదువుతున్నాడు. ఇతను గత ఏడు నెలల నుంచి నవ్య అనే అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
మంగళవారం మొహర్రం పండుగ కావడంతో స్నేహితులతో కలిసి బయటకు వచ్చిన నవ్య తన ఫ్రెండ్ శ్రేష్ఠతో ఫారెస్ట్ పార్క్ లో తాయి అనే స్నేహితుడిని కలిసేందుకు వెళ్లింది. తాయితో పాటు నవ్యను సతాయిస్తున్న రోహిత్ కూడా అక్కడకు చేరుకున్నాడు. నవ్యతో రోహిత్ కొద్ది సేపు మాట్లాడాలి అంటూ నవ్యను పక్కకి తీసుకెళ్లాడు.
మాట్లాడాక సర్ప్రైజ్ అంటూ ..అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో నవ్యపై విచక్షణారహితంగా కడుపు, చేతులు, కాళ్లు, మొహంపై పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడే కొద్ది దూరంలో ఉన్న సాయి, శ్రేష్ఠ కలిసి నవ్యను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నవ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.