మహారాష్ట్రలో మావోలు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లాలోరోడ్డు పనుల్లో ఉపయోగిస్తున్న 36 భారీ వాహనాలకు నిప్పు పెట్టారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. మరోసారి ఇక్కడ కనిపిస్తే ప్రాణాలు దక్కవని కార్మికులు, నిర్మాణ సిబ్బందిని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో అభివృద్ధి పనులను మావోయిస్టులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కాదని పనులు చేపడితే తీవ్ర నష్టం కలుగజేస్తున్నారు.
గడ్చిరోలిలో పనులు జరుగుతున్న ప్రాంతానికి దాదాపు 150 మంది మావోయిస్టులు చేరుకున్నారు. అనంతరం తుపాకీలతో బెదిరించి కాంట్రాక్టర్లు, కార్మికులు, వాహనదారులను ఓ చోట బంధించారు. ఆ తర్వాత అన్ని వాహనాలపై పెట్రోల్, డీజిల్ పోసి తగులబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తాము ఈ చర్యకు పాల్పడినట్లు మావోయిస్టులు కరపత్రాలను వదిలిపెట్టారు. కాంట్రాక్టర్ల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న బలగాలు కూంబింగ్ ప్రారంభిచాయి.