మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని, తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. యూఎస్ లోని న్యూజెర్సీలో ఎన్ఆర్ఐ తెలుగుదేశం సీనియర్ నాయకులు మన్నవ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో కొల్లు రవీంద్రతో పాటు పాల్గొన్న ఆనంద్ బాబు, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపాలన్న సంకల్పంతో చంద్రబాబు పని చేశారని అన్నారు.
ఆయన నాయకత్వంలో పని చేయడం సంతృప్తిని కలిగించిందని, ఓడిపోయినంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చంద్రబాబు మార్గదర్శకంలో మరింత పురోగతి చెందేలా ప్రతిఒక్కరూ కృషి చేయాల్సిన సమయం ఇదని అన్నారు. గత ఎన్నికల్లో ఎన్ఆర్ఐ నేతలు పార్టీ విజయం సాధించాలని ఎంతో శ్రమించారని మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.