రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “మన్మథుడు-2”. ఈ చిత్రంలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్లు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమాలో హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్లో కూడా లిప్లాక్ సన్నివేశాలను చూపించారు. ఈ సినిమాకు తాజాగా సెన్సార్ కంప్లీటైంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ “బాగా కష్టపడి పనిచేసిన తర్వాత ఫలితం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కడుపులో ఒకరకంగా ఉంటుంది. ఆంగ్లంలో దాన్ని ‘బటర్ఫ్లైస్ ఇన్ ది స్టమక్’ అంటారు. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. రొమాంటిక్ సినిమాలకు నేను ఇక దూరమవుతానేమోననుకుంటున్న సమయంలో ఓ ఫ్రెంచ్ సినిమా చూశా. ఓ మధ్యవయస్కుడి కథ. అమ్మ, ముగ్గురు సోదరీమణుల మధ్య పెరిగిన వ్యక్తి కథ. నాకు చాలా నచ్చింది. అందులో భావోద్వేగాలు బావున్నాయి. ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ నచ్చి నేను వెంటనే హక్కులు తీసుకున్నా. విజయనగరం నుంచి కూలీలుగా వెళ్లి పోర్చుగల్లో స్థిరపడ్డ ఓ కటుంబంలోని నాలుగో తరానికి చెందిన వ్యక్తుల కథను మేం చూపించాం. ‘అన్నమయ్య’ తర్వాత అంత స్వచ్ఛమైన తెలుగు ఇందులోనే మాట్లాడాను. ఇక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘చి.ల.సౌ’ చూశా. సున్నితమైన అంశాలను, హాస్యాన్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడనిపించింది. అతన్ని పిలిచి ఈ సినిమా చేయమంటే ముందు కాస్త తర్జనభర్జన పడ్డాడు. కానీ ఆ లైన్ని తీసుకుని మనకు తగ్గట్టు చాలా బాగా చేశాడు. దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు చేశాడు. అందరి దగ్గరా మంచి నటనను రాబట్టాడు. లక్ష్మిగారితో ‘నిన్నేపెళ్లాడుతా’ తర్వాత నేను నటించిన చిత్రమిది. కీర్తి సురేశ్, సమంత కేమియో చేశారు. రకుల్ చాలా బాగా నటించింది. తను బాగాలేదని నేను అన్నట్టు గతంలో పుకార్లు సృష్టించారు. కానీ ఆ అమ్మాయిని చూసి హెల్తీగా ఎలా ఉండాలో నేర్చుకోమని చాలా మందికి చెబుతుంటా.