telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తన కుమారుడిని అడ్డుకుంటారా.. పోలీసులపై టీఆర్ఎస్ ఎంపీ ఫైర్!

pothuganti ramulu MP Trs

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఎంపీ స్టిక్కర్‌తో ఉన్న కారులో ఉన్న ఎంపీ కుమారుడిని పోలీసులు అడ్డుకొన్నారు. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూలు టీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు పోలీసులతో గొడవ పడ్డారు. హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎంపీ కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు అయిన భరత్ కుమార్ ఈ నెల 15న మరో నలుగురితో కలిసి కారులో నగరానికి వస్తున్నారు.

పహాడీషరీఫ్-శ్రీశైలం రహదారిపై లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసులు ఎంపీ స్టిక్కర్‌తో ఉన్న కారులో ఎంపీ కనిపించకపోవడంతో కారును ఆపారు. దీంతో భరత్‌కుమార్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తాను ఎంపీ కుమారుడినంటూ పోలీసులను హెచ్చరించారు. దీంతో పోలీసులు కారును పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోసారి ఇలా చేయొద్దంటూ భరత్‌కుమార్‌కు చెప్పి వదిలేశారు.
ఎంపీ రాములు ఆ తర్వాత రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తన కుమారుడు వెళ్తున్న కారును ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. తాను 15 ఏళ్లు రాష్ట్రమంత్రిగా పనిచేశానని ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts