రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి 2014లో ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుపై నాగబాబు వివరణ ఇచ్చారు. అప్పుడున్న పరిస్థితులను బట్టి రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడైతే బాగుంటుందని తన తమ్ముడు పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతిచ్చారని వెల్లడించారు. అయితే, అదే పొత్తు ఇటీవల ఎన్నికల్లో కూడా కొనసాగిందంటూ వైసీపీ తన ఎన్నికల ప్రచారంలో ఆరోపించడం తెలిసిందే. దీనిపై మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు.
2014లో చంద్రబాబుపై కొన్ని ఆరోపణలు ఉన్నా, వైసీపీ అధినేతపై ఉన్న అవినీతి ఆరోపణలతో పోల్చితే అవి చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే టీడీపీని గెలిపించాలని పవన్ కల్యాణ్ ప్రచారం చేశారని తెలిపారు. అయితే, ప్యాకేజీ మాట్లాడుకుని డబ్బులు తీసుకున్నాడని చాలా చవకబారు కామెంట్లు చేశారని నాగబాబు అన్నారు. ఇటీవల ఎన్నికల్లో కూడా అదే ధోరణి కొనసాగిందని, పవన్ కల్యాణ్ ప్రజాదరణ పొందుతుండడం చూసి దుష్ప్రచారం మొదలుపెట్టారని ఆరోపించారు.