మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసుపై ఈ నెల 13వ తేదీన హైకోర్టు విచారణ చేపట్టనుంది. వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
రాష్ట్రంలోని 139 మున్సిపాలిటీల్లోని 69 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.ఈ రోజు మాత్రం 139 మున్సిపాలిటీలకు ఎన్నికలను నిర్వహిస్తామని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. గతంలో మున్సిపాలిటీ ఎన్నికలపై విధించిన స్టే కు సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించినట్టుగా హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు ఏ నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.