పెద్దలు పిల్లలను పొగడటం ఆయుక్షీణం అంటారు. అందుకే తన కొడుకు అఖిలేష్ పై విరుద్ధంగా మాట్లాడారా లేక నిజంగా ఇంకా పదవిపై ఆశలు తీరక అనారోగాని ములాయం తన కొడుకుపై విమర్శలు గుప్పించారు. చెప్పాలి అనుకుంటే, ఇద్దరు ఉన్నప్పుడే చెపితే సలహా ఇచ్చారు అనుకోవచ్చు, కానీ ఇంత మందిలో చెప్పారంటే ఏమనుకోవాలి.. అంటూ దీనిపై పరిపరివిధాల చర్చలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్పై ఆయన తండ్రి ములాయంసింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ నేతలు మంగళవారం లక్నోలో ఏర్పాటుచేసిన కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ములాయంసింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పార్టీ చీఫ్గా అఖిలేష్ పనితీరు అంత సంతృప్తికరంగా లేదని ములాయం అసంతృప్తి వ్యక్తం చేశారు.
అఖిలేష్ తన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేకపోతున్నాడని, దీనివల్ల రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ చాలా ముందుకు వెళ్లిందని, ఇప్పటికైనా అఖిలేష్ మేలుకోకుంటే నష్టపోవడం ఖాయమని హెచ్చరించారు. ముఖ్యంగా పార్టీలో క్రమశిక్షణ పెంపొందించాల్సిన అవసరం ఉందని, పార్టీ వ్యవహారాల్లో మహిళలకు ప్రాధాన్యం పెంచాలని ములాయం సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో మహాకూటమి ఏర్పాటుకు ఓ వైపు అఖిలేష్ యాదవ్ చురుకుగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన తండ్రి చేసిన వ్యాఖ్యలు, తన వైఫల్యాన్ని ప్రపంచానికి చాటినట్టుగా ఉందని భవిస్తారా.. లేదా సలహాగా తీసుకోని .. సరిదిద్దుకుంటారా.. అనేది వేచి చూడాల్సి ఉంది.