తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) మద్దతు ప్రకటించింది. ఇదే క్రమంలో జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ బస చేసిన లాడ్జిని పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
పలు ప్రజాసంఘాల కార్యకర్తలు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనవసర భేషజాలకు పోతున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలని కోరారు. లేనిపక్షంలో కార్మికుల సమ్మె ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో తెలియని పరిస్థితులేర్పడతాయని హెచ్చరించారు. ఈ కార్యకమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.