తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 35 రోజుల క్రితమే ఆర్టీసీ కార్మికులు చట్ట బద్ధంగా సమ్మె నోటీసును ఇచ్చారని అన్నారు. ఒక్క ఆర్టీసీ కార్మికుడిని కూడా సీఎం కేసీఆర్ ఉద్యోగం నుంచి తొలగించలేరని అన్నారు. న్యాయాన్ని పరిరక్షించేందుకు న్యాయస్థానాలు ఉన్నాయని చెప్పారు.
ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసేందుకు కేసీఆర్ కు సమయం ఉంటుందని… కార్మికులను కలిసేందుకు మాత్రం ఉండదని రేవంత్ దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం సమయంలో యోధుల్లా కనిపించినవారు ఇప్పుడు బానిసలు, కుక్కల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆరేళ్లుగా సచివాలయానికి కూడా రాని కేసీఆర్ పై పీడీ యాక్టు పెట్టి అండమాన్ జైలుకు పంపాలా? అని ప్రశ్నించారు.