ఏపీ రాజధాని అమరావతిలో ఉన్న ప్రజావేదికను కూల్చి వేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ప్రజావేదికను కూల్చి వేస్తే ప్రజాధనం దుర్వినియోగమవుతుందని చెప్పారు. ఈ కట్టడాన్ని కూల్చివేస్తే ప్రభుత్వ ఖజానాకు రెండు రకాలుగా నష్టం జరుగుతుందని చెప్పారు.
ప్రజావేదిక అక్రమమా? లేదా సక్రమమా? అనే విషయాన్ని పక్కనపెడితే… అది ప్రజా ధనంతో నిర్మించిన కట్టడమనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. మరో వేదికను నిర్మించేంత వరకు ప్రభుత్వ సమావేశాలను ప్రైవేట్ వేదికల్లో నిర్వహించాలంటే మళ్లీ ప్రజాధనం ఖర్చవుతుందని అన్నారు. ముందుగా ఇతర అక్రమ కట్టడాలను కూల్చివేసి, ఈలోపు కొత్త సమావేశ వేదికను నిర్మించిన అనంతరం ప్రజావేదికను తొలగిస్తే బాగుంటుందని కేశినేని సూచించారు.