నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికయ్యారు. తాము నిర్వహించిన సర్వేలో ఆదర్శ్ క్యాటగిరీలో ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికైనట్టు ప్రతిష్ఠాత్మక సంస్థ ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ సోమవారం ప్రకటించింది. సభలో లేవనెత్తిన ప్రశ్నలు, వాస్తవ సమస్యలను చర్చల ద్వారా సభ దృష్టికి తీసుకురావడం, ప్రజల్లో ఆదరణ, ప్రజా సమస్యల పరిష్కారం తదితర 10 అంశాల ఆధారంగా ఫేమ్ ఇండియా సర్వే నిర్వహించింది. దేశంలోని లోక్సభ సభ్యుల్లో 25 మందిని ఈ అవార్డుకు ఎంపికచేయగా, ఇందులో తెలంగాణనుంచి ఎంపీ కవిత ఉన్నారు.
ఈ నెల 31న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఫేమ్ ఇండియా మేగజైన్ నిర్వహించే అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. కాగా ఎంపీ కవిత ప్రస్థానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఫేమ్ ఇండియా మేగజైన్.. ఆమెను ధైర్యవంతురాలైన తెలంగాణ ఉద్యమకారిణిగా, అనన్య ప్రతిభాశాలిగా, యువ రాజకీయ నేతగా పేర్కొంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నుంచి తొలి మహిళా లోక్సభ సభ్యురాలిగా ఆమె గుర్తింపు పొందారని ప్రకటించింది.
రాజకీయాల కోసం రెచ్చగొట్టడం మానుకోవాలి: ఇంద్రకరణ్రెడ్డి