కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా సుమారు ఐదు నెలలకు పైగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. అయితే దేశవ్యాప్తంగా అన్లాక్ 4.0లో భాగంగా సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వనుందని అంటున్నారు. మూడో దశ అన్లాక్లో భాగంగా ఇప్పటికే రెస్టారెంట్లు, మాల్స్, జిమ్, యోగా కేంద్రాలు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు చివరి నాటికి అన్లాక్ 3.0 ముగియనుంది. ఆ తరవాత అన్లాక్ 4.0ను ప్రధాని మోదీ ప్రకటిస్తారు. ఈ నాలుగో దశలో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలు పెట్టనుందని సమాచారం. ప్రేక్షకులు సామాజిక దూరం పాటించేలా ఇద్దరు ప్రేక్షకుల మధ్య ఒకటి లేదా రెండు సీట్లు వదిలిపెట్టాలి. షో ప్రారంభంకావడానికి ముందు.. పూర్తయిన తరవాత థియేటర్ మొత్తాన్ని శానిటైజ్ చేయాలి. థియేటర్లో టెంపరేచర్ 24 డిగ్రీల కన్నా తక్కువ ఉండకుండా చూసుకోవాలి. ప్రేక్షకులు కచ్చితంగా మాస్క్ ధరించే థియేటర్ లోపలికి వెళ్లాలి. ప్రస్తుతం చైనాలో థియేటర్లు ఇవే నిబంధనలను పాటిస్తున్నాయి. అయితే, థియేటర్లు తెరుచుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందని అంటున్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేస్తుందా అనే విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!