మూవీ మొఘల్ రామానాయుడు జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని ఈ రోజు ఫిలింఛాంబర్లో ఆవిష్కరించారు. రామానాయుడు విగ్రహాన్ని సురేష్ బాబు ఆవిష్కరించగా, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, జి. ఆదిశేషగిరి రావు, పరచూరి వెంకటేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రామానాయుడు ఫ్యామిలీకి చెందిన సురేష్ బాబు, రానా, నాగ చైతన్య, వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా ఆయనతో తమ జ్ఞాపకాలు పంచుకున్నారు.
తెలుగు సినిమా నిర్మాతల్లో రామానాయుడు లెజెండ్. ప్రపంచంలోనే అత్యధిక సినిమాల నిర్మాతగా గిన్నీస్ బుక్ లో ప్లేస్ సంపాదించారు మూవీ మొఘల్. దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ మూవీలు తీసిన ఒకే ఒక నిర్మాత. ఆయన మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. అయితే రెండేళ్ల కిందట ఆయన మరణం సినీ పరిశ్రమను దుఃఖ సాగరంలో ముంచింది. రామానాయుడు ఎందరో నటీనటుల్ని, టెక్నీషియన్స్ ను పరిచయం చేశారు. ఈ జనరేషన్ ప్రొడ్యూసర్లకు డి. రామానాయుడు ఓ ఇన్సిపిరేషన్. ఆయన సేవలు సినిమా పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదు. రామానాయుడు ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, వృద్ధాశ్రమాల్ని నెలకొల్పి తన దయాగుణాన్ని చాటారు. అలాంటి మహోన్నత వ్యక్తి రామానాయుడు. ఆయన జయంతి సందర్భంగా పలువురు సెలబ్రిటీలు అంజలి ఘటించారు.