ఇరాక్కు అదనపు దళాలను తరలిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఐఆర్ఎఫ్ (తక్షణ స్పందనా దళం)కు చెందిన 750 సైనికులను బాగ్దాద్ నగరానికి తరలించి కార్యాలయ భవన సముదాయానికి అదనపు రక్షణ కల్పిస్తామని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ చెప్పారు. ఇరాక్లో అమెరికన్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఈ అదనపు దళాలను తరలిస్తున్నట్లు ఆయన ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేసిన నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. మంగళవారం నాటి దాడికి ఇరాన్ వత్తాసు పలుకుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
ఇరాక్ రాజధానిలోని బాగ్దాద్ లోని అమెరికా దౌత్య కార్యాలయం ఎదుట రెండవ రోజు బుధవారం కూడా నిరసనలు హోరెత్తాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు అమెరికా సైనికబలగాలు బాష్ప వాయువు, రబ్బర్ బులెట్లతో విరుచుకుపడ్డాయి. అమెరికా వైమానిక దాడులపై ఆగ్రహించిన ఇరాకీ ప్రజలు బాగ్దాద్లోని అమెరికన్ ఎంబసీ కార్యాలయానికి మంగళవారం నిప్పంటించారు. దీనికి ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎంబసీపై దాడులు ఇరాన్కు చెందిన షియా ముస్లింల మిలీషియా పనేనని ట్రంప్ నిందించారు. మరో వైపు అమెరికా దాడులకు వ్యతిరేకంగా నిరసనలు ఇరాక్ అంతటికీ విస్తరించాయి. బుధవారం నాడు బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయంలోకి దూసుకెళ్లేం దుకు వేలాది మంది ప్రయత్నించారు. కార్యాలయం వద్ద వున్న అమెరికన్ పతాకాలను దగ్ధం చేశారు. ఇక నజాఫ్, బస్రా, కిర్కుక్ తదితర నగరాలలో వేలాది మంది స్త్రీ, పురుషులు అమెరికా దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ యెత్తున ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా సైన్యాలను దేశం నుండి బహిష్కరించాలని అనేక మంది ఎంపిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఇరాక్ సర్కారు తాము అమెరికా రాయబారిని పిలిపించి నిరసన తెలియచేస్తామని వెల్లడించింది. ఇరాక్లో ఇస్లామిక్ మిలిటెంట్లతో పోరాడుతున్న షియా మిలిషియా కూటమి హసీద్ అల్ షబాబీ కార్యకర్తలను ఉగ్రవాదులుగా ఆరోపిస్తూ వారిపై అమెరికా ఆదివారం నాడు వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే. అమెరికా జరిపిన ఈ దాడితో ఆ దేశంతో తమ సంబం ధాలు గాడి తప్పాయని ఇరాక్ సర్కారు వ్యాఖ్యానించింది. అమెరికా తన రాజకీయ ప్రయోజనాల కోసం మారణహోమం సృష్టిస్తోందని విమర్శిస్తోంది.