స్టార్ హీరోగా.. విలన్గా.. నటుడిగా.. కారెక్టర్ ఆర్టిస్టుగా.. నిర్మాతగా.. విద్యా వేత్తగా.. బిజినెస్ మ్యాన్ గా.. రాజకీయ నాయకుడిగా.. ఇలా ఒక్కటేంటి ఎన్నో విధాలుగా ప్రజల ముందే ఉన్నాడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.
తన 47 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో 5 వందలకు పైగా సినిమాలతో, ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అశేష అభిమానగణాన్ని ఉర్రూతలూగించిన మహానటుడాయన. ఎక్కడో రాయలసీమలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఇండస్ట్రీకి వచ్చాడు భక్తవత్సల నాయుడు. ఆ తర్వాత ఆయనే మోహన్ బాబుగా మారాడు.
ఈ రోజు (మార్చి 19) మోహన్ బాబు పుట్టిన రోజు. ఈయన పుట్టినరోజును అభిమానులు పండగ చేసుకుంటారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని మోదుగు పాలెంలో ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబంలో 1952 మార్చి 19న మోహన్ బాబు జన్మించారు. ఆయన తండ్రి ఓ పాఠశాల పంతులు. ఇంట్లో పెద్దవాడు మోహన్ బాబు. ఆయన అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. తమ్ముళ్ళు ,చెల్లెళ్ళు ఉన్నారు. తండ్రి సంపాదించే జీతంతోనే ఇల్లు గడవడం కష్టమని భావించారు. దాంతో ప్లస్ టూ పాస్ కాగానే, ఫిజికల్ ఎడ్యుకేషన్ లో శిక్షణ తీసుకున్నారు.
మద్రాసు వెళ్ళి అక్కడ ఓ పేరున్న ఉన్నత పాఠశాలలో పి.ఇడి.గా పనిచేశారు. అక్కడ ఆయనను కులవివక్ష కలచివేసింది. ఆ సమయంలోనే భవిష్యత్ లో కులం అన్న మాట లేకుండా ఉండే పాఠశాలలో పనిచేయాలని భావించారు. ఆ పాఠశాల నుండి బయటకు వచ్చాక సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించసాగారు. దర్శకుడు కావాలనుకున్నారు. కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. కొన్ని సినిమాల్లో బిట్ రోల్స్ లో కనిపించారు.
అలా సాగుతున్న భక్తవత్సలం నాయుడు జీవితాన్ని దాసరి నారాయణరావు రూపొందించిన ‘స్వర్గం-నరకం’ (1975) చిత్రం చిత్రంతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో నెగటివ్ షేడ్స్ రోల్ లో కనిపించి, తరువాత ఇల్లాలు అంటే గౌరవం పెంచుకొనే పరివర్తన చెందిన పాత్ర పోషించారు. .ఆ సినిమాతోనే భక్తవత్సలం నాయుడు కాస్తా మోహన్ బాబుగా పరిచయం అయ్యారు.
ఆ తరువాత దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘సర్దార్ పాపారాయుడు’లో మోహన్ బాబు ‘పప్పారాయుడు…పప్పారాయుడు…’ అంటూ బ్రిటిష్ దొరగా కాసేపు కనిపించి సందడి చేశారు. మోహన్ బాబులోని విలక్షణతను గుర్తించిన ఆయన గురువు దాసరి నారాయణరావు, ‘కేటుగాడు’ చిత్రంతో హీరోని చేశారు. ఆ పైన బాపు, కె.రాఘవేంద్రరావు వంటి దర్శకులు సైతం మోహన్ బాబుకు తగిన పాత్రలు ఇచ్చారు.
కెరీర్ తొలి నాళ్లలో హీరోతో పాటు విలన్ గానూ అలరించాడు మోహన్ బాబు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది విలన్లు అయినా ఉండొచ్చు కానీ మోహన్ బాబు లాంటి విలన్ మాత్రం మళ్లీ రాడు.. లేడు.. రాబోడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే విలన్కు కూడా ఓ స్టైల్.. మేనరిజమ్స్ అలవాటు చేసిన నటుడు ఒక్క మోహన్ బాబు మాత్రమే.
అలాగే సొంతగా ‘లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ సంస్థను స్థాపించి, తొలి ప్రయత్నంగా ‘ప్రతిజ్ఞ’ చిత్రాన్ని నిర్మించి, నటించారు. అప్పటి నుంచీ మోహన్ బాబు తన సొంత సంస్థలో పలు చిత్రాలు నిర్మిస్తూ హీరోగా సాగారు.
ఎనభైలో ఏ సినిమా విడుదలైనా కూడా అందులో మోహన్ బాబు కనిపించాల్సిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు నుంచి చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వరకు అందరితోనూ కలిసి నటించాడు మోహన్ బాబు.
90ల్లో అల్లుడు గారు సినిమాతో మళ్లీ హీరో అయ్యాడు. అక్కడ్నుంచి సూపర్ స్టార్ గా వెలిగిపోయాడు మోహన్ బాబు. బ్రహ్మ, పెదరాయుడు, అల్లరి మొగుడు, అడవిలో అన్న లాంటి ఎన్నో సంచలన సినిమాలతో సత్తా చూపించారు. ఇక మిలీనియం మొదట్లో సురేష్ కృష్ణ తెరకెక్కించిన రాయలసీమ రామన్న చౌదరి చిత్రం మోహన్ బాబు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.
ఇలా 500పైగా చిత్రాల్లో నటించి, ఈ నాటికీ నటించడానికి ఉత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నారాయన. ఈ మధ్యే సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కలెక్షన్ కింగ్ . ఆయన అభినయంలోని వైవిధ్యం తెలుగువారిని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంది.
మోహన్ బాబు కెరీర్లో చేసినన్ని పాత్రలు మరే హీరో చేయలేదన్న నిజమే అని చెప్పాలి. ఇన్నేళ్ల ప్రయాణం ఇంకా సాగాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.