ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలు దేశాధినేతలతో సమావేశమయ్యారు. ప్రపంచాన్ని పీడిస్తున్న ఉగ్రవాదం, వాతావరణ సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవడంపై చర్చించారు. ట్రంప్తో కూడా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, రక్షణ, అంతరిక్ష, రంగాలతో పాటు ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు, ఇరాన్లో అస్థిరత, 5జీపై నేతలిద్దరూ ప్రముఖంగా చర్చించారు. ఉగ్రవాదం తదితర అంశాల్లో ప్రపంచానికి బలమైన నాయకత్వం అందిద్దామని నిర్ణయించారు. ప్రపంచ శాంతి, సుస్థిరతకు ఉభయ దేశాలు కీలక భూమిక పోషించాలని కాంక్షించారు. తమ ఇంధన అవసరాల రీత్యా ఇరాన్లో శాంతి, సుస్థిరతకు భారత్ ఎంతో ప్రాధాన్యమిస్తోందని ట్రంప్నకు ప్రధాని స్పష్టం చేశారు.
గల్ఫ్ సుస్థిరతకు తాము కట్టుబడి ఉన్నామనీ, ఇంధన ధరలు స్థిరంగా ఉండగలవని అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు. 5జీ సాంకేతికతకు భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ కాగాలదని నేతలిద్దరూ భావించారు. ఈ సాంకేతికత ఆధార వర్తకానికి ఉన్న అవకాశాలపైనా చర్చించారు.. అని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్ గోఖలే విలేకరులకు తెలిపారు.