ప్రధాని నరేంద్రమోదీ నేటి మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ, దీపావళికి ముందుగానే ప్రజలు తమను ఆశీర్వదించారని అన్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో విజయం అక్కడి ముఖ్యమంత్రుల పనితీరుకు నిదర్శనమని చెప్పారు. భాజపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో మోదీ మాట్లాడారు. నేటి కాలంలో వరుసగా రెండోసారి గెలవడం చాలా కష్టమని.. ఫలితాలు తమ పాలనకు గీటురాయి అని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో మహారాష్ట్ర, హరియాణాల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఫడణవీస్, ఖట్టర్ సుపరిపాలన ఈ విజయంలో కీలకమని ప్రధాని కొనియాడారు. హరియాణాలో భాజపా ఓటు శాతం 33 నుంచి 36 శాతానికి పెరిగిందన్నారు. ఎక్కువ స్థానాల్లో గెలిపించిన హరియాణా భాజపా నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. మహారాష్ట్రలో భాజపా, శివసేన కలిసి ఐదేళ్లపాటు స్థిరమైన పాలన అందించాయన్నారు. 50 ఏళ్ల తర్వాత మొదటిసారి మహారాష్ట్రలో సీఎం పూర్తిగా పదవీకాలంలో ఉన్నారని.. ఫడణవీస్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని మోదీ చెప్పారు.