ఈనెల 17న లాక్డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ వచ్చే మంగళవారం మరోమారు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. లాక్డౌన్ నిబంధనలను వచ్చే దశలో ఎలా సడలించవచ్చన్న దానిపై సీఎంలతో మోదీ చర్చిస్తారని సమాచారం.
అలాగే, లాక్డౌన్ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం ఎలా అన్న విషయంలో సీఎంల అభిప్రాయాలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. కంటెయిన్మెంట్ జోన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చర్చిస్తారు. మూడో దశ లాక్డౌన్ గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో మోదీ నిర్వహించనున్న సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.