తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకాన్ని మోదీ, చంద్రబాబు కాపీ కొట్టారని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం వరగంల్లో సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు రైతుబంధును కాపీ కొట్టి ‘‘అన్నదాత సుఖీభవ’’ అనే పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అలాగే దేశ ప్రధాని నరేంద్రమోడీ సైతం రైతుబంధు ను కాపీ కొట్టి ‘‘పీఎం కిసాన్’’ పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు. మెగా టెక్స్టైల్ పార్క్ పరకాలకు తెచ్చామన్నారు. కేంద్రం మెడలు వంచే స్థితిలో తెలంగాణ ప్రజలు ఉండాలన్నారు.
మిషన్ భగీరథ పథకాన్ని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు మోదీ, రాహుల్ మధ్య అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, మోదీ, రాహుల్ కంటే గొప్ప నాయకులు ఎంతోమంది ఉన్నారన్నారు.తెలంగాణలోని ఒక్క ప్రాజెక్ట్కు కూడా కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలన్నారు. రోజు రోజుకు మోదీ గ్రాఫ్ పడిపోతోందన్నారు. 2014లో ప్రధాని మోడీ ఏదో చేస్తారని ఓట్లేసిన జనానికి ఆయనంటే ఏంటో అర్థమైపోయిందని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట జాతీయ పార్టీలు లేవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.