తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తన ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. అయితే ఓటు వేసే క్రమంలో ఆమె పొరపాటు పడ్డారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పొరపాటు పడినట్లు ఎమ్మెల్యే సీతక్క గుర్తించారు. జరిగిన పొరపాటును వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు సీతక్క. అంతే కాదు తిరిగి మరోసారి ఓటు వేసే అకాశం కల్పించాలని మరో బ్యాలెట్ పత్రం ఇవ్వాలని సహాయ రిటర్నింగ్ అధికారిని కోరారు.
ఎన్నికల పరిశీలకుడు, సహాయ రిటర్నింగ్ అధికారులు ఉన్నతాధికారులు ఈసీని సంప్రదించారు. ఆ సమయంలో సీతక్క అక్కడే నిరీక్షించారు. కొత్త బ్యాలెట్ పత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో మొదటి బ్యాలెట్ పత్రాన్నే బ్యాలెట్ బాక్సులో వేశారు.
అయితే ఓటు వేయడంలో ఎలాంటి తప్పులు చేయలేదని సీతక్క పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ పైభాగంలో పొరపాటున పెన్ మార్క్ పడటంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
తాను వేయాల్సిన చోట ఓటు సరిగానే వేశానని చెప్పారు. అయితే పెన్ మార్క్ పడటంతో.. చెల్లుబాటు అవుతుందో, లేదో అనే అనుమానం ఉందన్నారు. అయితే ఇబ్బంది ఏముండదని అధికారులు చెప్పారని అన్నారు.
కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదని, ఇంక్ పడిన బ్యాలెట్ పేపర్నే బాక్సులో వేసినట్లు తెలిపారు. ఓటు చెల్లుతుందా లేదా అనేది వాళ్ళకే తెలియాలి అని అన్నారు. ఆత్మసాక్షిగా తాను వేయాల్సిన వారికే ఓటు వేసినట్లు సీతక్క వివరించారు.
మరోవైపు.. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 21న జరగనుంది. అయితే ఇప్పటివరకు పార్టీల మద్దతు సమీకరణాలను పరిశీలిస్తే.. ద్రౌపది ముర్ముకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.