తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్నదాత లోగిళ్లు ఆనందాల సిరులతో కళకళలాడుతున్నాయని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా వరుసగా రెండో ఏడాది రెండో విడత ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం రైతులకు మంగళవారం విడుదల చేసింది. ఒక్కో రైతుకు రూ.4వేలు చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే ప్రభుత్వం జమచేసింది. ఈ సందర్భంగా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యురాలు విడదల రజిని గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అన్నదాతల కోసం ఎందాకైనా వెళ్తుందని చెప్పారు. అన్నదాతలకు వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా తీసుకొచ్చామని చెప్పారు. వ్యవసాయానికి రోజుకు 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందజేస్తామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే రజిని చెప్పారు. తాము ఎన్నికల సమయంలో నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.12500 చొప్పున రూ.50వేలు మాత్రమే అన్నదాతకు పెట్టుబడి సాయం కింద ఇస్తామని హామీ ఇచ్చామని, కానీ అంతకు మించి ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్లపాటు మొత్తం 67,500 ఆర్థిక సాయం చేస్తున్నామని వెల్లడించారు. తాము హామీ ఇచ్చిన దానికంటే కూడా రూ.17,500 అదనంగా రైతులకు అందజేస్తున్నామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులు, అటవీ, అసైన్డ్ భూములు సాగుచేసుకుంటున్నవారికి కూడా అందజేస్తూ చరిత్ర సృష్టించామని చెప్పారు. అన్నదాతలు సాగుచేసిన పంటలకు కచ్చితంగా మద్దతు ధర దక్కేలా పంటల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి సాయం చేస్తున్నామన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో కర్షకులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా నిధిని ఏర్పాటుచేసి ఆర్థిక సాయం అందజేస్తున్నామని వెల్లడించారు. తాజాగా వరదల వల్ల నష్టపోయిన 1.66 లక్షల మంది రైతులకు ఈ రోజే రూ.135.73 కోట్లను నేరుగా బాధిత రైతుల బ్యాంకు ఖాతాలకే జమచేశామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఇంత త్వరగా నష్టపరిహారాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదని తెలిపారు.